భువనేశ్వర్: రష్యా చట్టసభ ప్రతినిధి పావెల్ ఆంటోవ్.. అనుమానాస్పద రీతిలో ఒడిశాలోని ఓ హోటల్లో మృతిచెందారు. ఆ రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో ఆయన వెకేషన్ కోసం వచ్చారు. 65వ పుట్టిన రోజు జరుపుకునేందుకు ఆయన ఇండియాలో టూర్ చేస్తున్నారు. హోటల్లోని మూడవ అంతస్తు కిటికీ నుంచి కిందపడి అతను మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. పావెల్ ఓ మల్టీ మిలియనీర్. ఆయనకు గొప్ప దాతగా కూడా పేరుంది.
రాయ్గడ్ హోటల్లోని శనివారం పావెల్ను రక్తపుమడుగులో గుర్తించారు. రెండు రోజుల వ్యవధిలోనే రష్యాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే హోటల్లో బస చేస్తున్న ఇద్దరు రష్యన్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పావెల్ ఆంటోవ్తో పాటు వాల్దిమిర్ బిడనోవ్ కూడా చనిపోయాడు. అయితే ఈ ఇద్దరూ రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శకులు అని చెబుతున్నారు. ఒడిశా పోలీసులు ఈ మరణాల పట్ల ఇంకా క్రిమినల్ లింకును కనుగొనలేదని రష్యా ఎంబసీ తెలిపింది.
ఉక్రెయిన్పై జరుగుతున్న రష్యా దాడిని పావెల్ ఆంటోవ్ ఖండిస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆంటోవ్ స్నేహితుడు మృతిచెందాడు. అయితే ఆ డిప్రెషన్లోనే పావెల్ చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన బిడనోవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు రష్యన్ల మృతి పట్ల ఆరా తీస్తున్నామని, వ్లాదిమిర్ ఓబ్లాస్ట్ అసెంబ్లీలో పావెల సభ్యుడని, ఒడిశాలో జరిగిన ఇద్దరి మరణాల గురించి తెలుసు అని, చనిపోయిన వ్యక్తి బంధువులతో టచ్లో ఉన్నామని, అలాగే ఒడిశా స్థానిక అధికారులతోనూ మాట్లాడుతున్నామని, ఇప్పటి వరకు ఈ రెండు మరణాల్లో క్రిమినల్ కోణం బయటపడలేదని రష్యా ఎంబసీ తెలిపింది.