న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వారిని వేగంగా భారత్కు తరలిస్తున్నది. రాబోయే రోజుల్లో 31 విమానాల్లో తూర్పు యూరోపియన్ దేశంలో చిక్కుకుపోయిన 6300 మంది భారతీయులను తరలించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గంగాలో భాగంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, స్పైస్జెడ్, ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రత్యేక విమానాలు నడుపనున్నాయి. ఈ నెల 2 నుంచి రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి భారతీయులను తరలించేందుకు 21 విమానాలు నడవనున్నాయి.
హంగేరిలోని బుడాపెస్ట్ నుంచి నాలుగు విమానాలు, పోలాండ్ని ర్జెస్జో నుంచి నాలుగు, స్లోవేకియాలోని కోసీస్ నుంచి మరో విమానం నడువనున్నది. ఎయిర్ ఫోర్స్ బుకారెస్ట్ నుంచి భారతీయులను తరలించనున్నది. మొత్తం 31 విమానాలు 2-8వ తేదీ వరకు 6,300 మంది కంటే ఎక్కువ మందిని స్వదేశానికి తీసుకురాబోతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైజ్ జెట్ విమానాల్లో 180 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. ఎయిర్ ఇండియా 250, ఇండిగో 216 మందిని తరలించే సామర్థ్యం ఉన్నది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏడు, స్పైస్జెట్ 4, ఎయిర్ ఇండియా ఏడు, ఇండిగో 12 విమానాల్లో ప్రజలను తరలించనున్నది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా బుకారెస్ట్ నుంచి, ఇండిగో బుకారెస్ట్, బుడాపెస్ట్, ర్జెస్జో నుంచి నాలుగు చొప్పున విమానాలను నడుపుతున్నది. స్పైస్జెట్ బుకారెస్ట్ నుంచి 2, బుడాపెస్ట్ నుంచి ఒకటి, స్లోవేకియాలోని కోసీస్ నుంచి మరో విమానంలో భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం 9 విమానాల్లో తరలించింది. ఆపరేషన్ గంగా కింద గత 24 గంటల్లో ఆరు విమానాలు భారత్కు బయలుదేరాయని విదేశాంగ మంత్రి జైశంకర్ బుధవారం తెలిపారు.