RTI Data | న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్’ నుంచి వేలాది దరఖాస్తుల రికార్డుల్ని మోదీ సర్కార్ తొలగించింది. తమ ఖాతాలోని దరఖాస్తుల సమాచారం గల్లంతైందని, కనిపించటం లేదని వేలాది మంది సమాచార హక్కు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్’ను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగానికి చెందిన ‘ఎన్ఐసీ’ నిర్వహిస్తున్నది. ప్రభుత్వ ఉత్తర్వులు, పాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించిన డాటా ఎందుకు తొలగించారు? అన్నదానిపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ‘2021-2023 మధ్య తన ఆన్లైన్ ఖాతాలోని సమాచారం కనిపించకుండా పోయింది’ అని బీహార్కు చెందిన సమాచార కార్యకర్త కన్హయ్యకుమార్ తెలిపారు.
‘ఆర్టీఐ ఖాతాలోని సమాచారమంతా పోయింది. ప్రభుత్వ పాలనా చరిత్ర అంతా డిలీట్ చేశారు’ అని డిజిటల్ రైట్స్ కార్యకర్త శ్రీనివాస్ కొడాలి టిట్టర్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల సమాచారాన్నీ తొలగించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారు ‘ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్’లో స్వీయ ఖాతాను తెరిచి.. దీని ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని కోరవచ్చు. సామాజికవేత్తలు, జర్నలిస్టులు, ఇతర సంస్థలు ఈ పోర్టల్లో ఖాతాలను తెరిచాయి. ఇప్పుడు వీరి ఖాతాల్లోని డాటా అంతా కనిపించకుండా పోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఆర్టీఐ దరఖాస్తుల్లో రికార్డ్స్ గల్లంతు కావటంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేయటమే మోదీ సర్కార్ లక్ష్యమని ఆరోపించాయి. ప్రజాస్వామ్యంపై కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని విమర్శించాయి.