న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు తీవ్రమైన అంశమని, ఉచితాలు ఆర్ధిక వ్యవస్ధపై పెను ప్రభావం చూపుతాయని సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసిన నేపద్యంలో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి ఎలాంటి ఉచితాలు అందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉచితాలతో ఆర్ధిక వ్యవస్ధ డబ్బును కోల్పోతోందని, అయితే అదే సమయంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యల నేపధ్యంలో ఆర్ఎల్డీ నేత స్పందించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సాహసంతో కూడుకున్నవని, అయితే ఇవి సరైన స్ఫూర్తిలో లేవని జయంత్ చౌధరి వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలకు రేషన్ అందించడం లేదా వారికి ఆర్ధికంగా చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
జీవించే హక్కు సహా ప్రాధమిక హక్కులను పరిరక్షించేందుకు ఇవి అవసరమని చెప్పరు. ఎన్నికల సందర్భంగా ఇచ్చే ఉచిత హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం లేదని కేంద్రం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇది బీజేపీ వరకూ వాస్తవమని, తమకు మాత్రం వర్తించదని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించామని ఆయన ట్వీట్ చేశారు.