న్యూఢిల్లీ, జూలై 23: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగిసేందుకు ఒకరోజు ఉందనగా పార్లమెంటు శనివారం సాయంత్రం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఉభయసభల సభ్యులు, ఇతరులు హాజరయ్యారు. రాంనాథ్ కోవింద్ తన వీడ్కోలు ప్రసంగంలో పార్లమెంటు సభ్యులకు కొన్ని హితవచనాలు పలికారు.
తనను తాను పార్లమెంటు సభ్యులతో, ఇతరులతో కూడిన విశాల కుటుంబ సభ్యుడిగానే భావించుకొంటానని చెప్పారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి గుడి లాంటిదని పేర్కొన్నారు. ఎంపీలు చర్చలో పాల్గొనడం, అసమ్మతి తెలిపే విషయంలో గాంధేయ తత్వాన్ని అనుసరించాలని సూచించారు. కుటుంబంలో మాదిరిగానే వారిలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చని, దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పారు. 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. తనకు రాష్ట్రపతిగా సేవలు అందించే అవకాశం కల్పించినందుకు దేశప్రజలకు, ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణం స్వీకరిస్తారు.