Rajouri | జమ్ముకశ్మీర్లోని రాజౌరీలో గ్రామ రక్షకులకు రైఫిళ్లు అందిస్తున్నారు. వారికి ఆధునిక రైఫిల్ ఎస్ఎల్ఆర్లో సీఆర్పీఎఫ్ శిక్షణ అందిస్తున్నది. ఇటీవల రాజౌరీలోని డాంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు ఏడుగురిని హతమార్చిన నేపథ్యంలో గ్రామ రక్షకులకు ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ గ్రామ రక్షకులనే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (వీడీజీ) అని ప్రభుత్వం పేర్కొంటున్నది.
జమ్ముకశ్మీర్లోని పలు జిల్లాల్లో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ లో భాగమయ్యే వారిని ఎంపిక చేసేందుకు శిబిరాలను కూడా చేపడుతున్నారు. ఎంపిక చేసిన యువకులకు శారీరక దారుఢ్య వ్యాయామాలతో పాటు ఆధునిక రైఫిళ్లు వాడటంపై శిక్షణ అందిస్తున్నారు. మంగళవారం నాడు సుందర్బనీ సెక్టార్లోని మహదేవ్ మేనకా ఫైరింగ్ రేంజ్లో పలువురు వీడీజీలకు ఫైరింగ్ ప్రాక్టీస్ జరిపించారు. ఎల్ఓసీ సమీపంలోని గ్రామాల నుంచి దాదాపు 50 మంది ఈ ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు.
ఇటీవలి దాడుల అనంతరం జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని జమ్ముకశ్మీర్ అధికారులు వీడీజీలకు సూచించారు. జమ్ము ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి ఉగ్రవాదులు భంగం కలిగించవచ్చని చెప్తూ అప్రమత్తంగా ఉండి ప్రజలను రక్షించాలని కోరింది. దీంతో జమ్ము, సాంబా, కథువా జిల్లాలతో పాటు భారతదేశం-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో వీడీజీలు చురుకుగా మారారు. డాంగ్రీ గ్రామంలో దాడి అనంతరం రాజౌరి జిల్లాలోని పలు గ్రామాల్లో జనవరి 5న వీడీజీ శిబిరం నిర్వహించి.. ఇందులో చేరే వారి పేర్లను నమోదు చేసుకున్నారు.