(స్పెషల్ టాస్క్ బ్యూరో)
బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం కొనకపోవడంతో అగ్గువ సగ్గువకు దళారులకు అమ్మి నిండా మునుగుతున్నారు. హర్యానా సర్కారు అనాలోచిత నిర్ణయంతో దేశానికి అన్నంపెట్టే రైతన్న ఆగమవుతున్నాడు. ఈ నెల 1 నుంచి హర్యానా స్టేట్ కో-ఆపరేటివ్ సప్లయ్ అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (హైఫెడ్) ద్వారా సజ్జలు కొంటామని హర్యానా బీజేపీ సర్కారు ప్రకటించింది. క్వింటాల్ సజ్జలకు రూ.2,350 మద్దతు ధర చెల్లిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లకు రైతన్నలు పోటెత్తారు.
అయితే, నిబంధనలు, పంట నాణ్యతలాంటి సాకులతో 12వ తేదీ నుంచి సర్కారు సజ్జల కొనుగోలు ప్రక్రియను నిలిపేసింది. రాష్ట్రంలోని ప్రముఖమైన సోహానా మార్కెట్లోకి 10,212 క్వింటాళ్ల సజ్జలను రైతులు అమ్మకానికి తీసుకురాగా.. గడిచిన 18 రోజుల్లో 217 క్వింటాళ్ల సజ్జలు మాత్రమే హైఫెడ్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన పంటకు కూడా పలు కారణాలు చెబుతూ హైఫెడ్ అధికారులు మద్దతు ధర చెల్లించలేదు.
యార్డులో కుప్పలుగా పోసిన మిగతా పంటను విధిలేక తక్కువ ధరకు అమ్ముకొన్న అన్నదాతలు.. ఇంటిదారి పడుతున్నారు. మరికొంత మంది రైతులు ఇంకా వ్యవసాయ మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. కనీనా, మహేంద్రగఢ్ తదితర మార్కెట్లలో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.