జైపూర్: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి, రైతులకు క్షమాపణలు చెప్పాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot ) డిమాండ్ చేశారు. హర్యానాలోని కర్నాల్ టౌన్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని గెహ్లాట్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనలో మొత్తం 10 మంది రైతులకు గాయాలయ్యాయి. లాఠీచార్జి జరుగుతుండగా ఓ అధికారి రైతుల తలలు పగులగొట్టండి అని ఆదేశించడం వీడియోలో రికార్డయ్యింది.
దాంతో ఆ అధికారి తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా, సదరు అధికారిపై హర్యానా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గెహ్లాట్ మండిపడ్డారు. కర్నాల్ లాఠీచార్జిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతలా మాటలు చెబుతున్నారు తప్ప.. రైతులపై దాడి చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హితవు పలికారు. రైతుల డిమాండ్ మేరకు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సూచించారు. అంతేగాక, కర్నాల్ లాఠీచార్జికి సంబంధించి కేంద్ర సర్కారు రైతులకు క్షమాపణ చెప్పాలని గెహ్లాట్ డిమాండ్ చేశారు.