న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లుటియన్స్లోని అక్బర్ రోడ్డు పేరును దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మార్గంగా మార్చాలని బీజేపీ మీడియా విభాగం ఢిల్లీ చీఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కు నవీన్కుమార్ జిందాల్ లేఖ రాశారు. అక్బర్ రోడ్డు పేరును మార్చడం ద్వారా దేశ మొట్టమొదటి సీడీఎస్ జ్ఞాపకాలను ఢిల్లీలో శాశ్వతంగా నిలిచేలా చూడాలని కోరారు. జనరల్ రావత్కు కౌన్సిల్ ఇచ్చే నిజమైన నివాళి ఇదేనని నమ్ముతున్నానన్నారు.
అక్బర్ ఒక ‘ఆక్రమణదారుడు’ అని, ప్రముఖ మార్గమైనందున దీనికి జనరల్ రావత్ పేరు పెట్టాలని కోరారు. ఎన్డీఎంసీ వైస్ చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ ఈ డిమాండ్ పట్ల తాను సానుకూలంగా ఉన్నానన్న ఆయన.. దీనిపై ఎన్డీఎంసీలో చర్చించాలన్నారు. పలువురు చేసిన అభ్యర్థలను తాను సోషల్ మీడియాలో చూశానన్న ఆయన.. ఎన్డీఎంసీ నిర్ణయాధికారులు చర్చిస్తారన్నారు.
ఇదిలా ఉండగా.. అక్బర్ రోడ్ పేరు మార్చాలని డిమాండ్లు, అభ్యర్థనలు రావడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలని మంత్రి వీకే సింగ్ గతంలో లేఖ రాశారు. గత అక్టోబర్లో అక్బర్ రోడ్లోని సైన్బోర్డును పలువురు ధ్వంసం చేసి.. ‘సామ్రాట్ హేము విక్రమాదిత్య మార్గ్’గా పేర్కొంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. అక్బర్ రోడ్ దేశ రాజధాని వీవీఐపీ జోన్ కాగా.. ఇండియా గేట్ రౌండ్ అబౌట్ నుంచి తీన్మూర్తి రౌండ్ అబౌట్ వరకు విస్తరించి ఉంటుంది. కాంగ్రెస్ కార్యాలయంతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ నివాసం ఈ రోడ్డులోనే ఉన్నాయి.