న్యూఢిల్లీ, జూన్ 6: మహమ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. భారత కంపెనీల ఉత్పత్తులను ఇస్లాం దేశాల్లోని వ్యాపారులు బహిష్కరిస్తున్నారు. కువైట్లోని ఆల్-ఆర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు సూపర్మార్కెట్లు, స్టోర్ల నుంచి భారత్లో తయారైన మసాలా ఉత్పత్తులు, బియ్యాన్ని తొలగించినట్టు నిర్వాహకులు తెలిపారు. మరికొన్ని అరబ్దేశాల్లోని సూపర్మార్కెట్ల షెల్ఫ్ల్లో ఉన్న భారత ఉత్పత్తుల మీద ప్లాస్టిక్ కవర్లను కప్పి ‘భారత ఉత్పత్తులను మేము తొలగిస్తున్నాం’ అనే బోర్డులు వేలాడదీయం కొన్ని వీడియోల్లో కనిపిస్తున్నది.
భారత్కు చెందిన వస్తువులను, సినిమాలను బహిష్కరించాలని ముస్లిం దేశాల్లో సోషల్మీడియాలో ఉద్యమం ఊపందుకున్నది. నూపుర్ శర్మ, జిందాల్ అనుచిత వ్యాఖ్యలను ఇండోనేషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, జోర్డాన్, అఫ్గానిస్థాన్, మాల్దీవులు సోమవారం ఖండించాయి. ఈ మేరకు అక్కడి దౌత్యవేత్తలకు సమన్లు పంపించాయి. జాబితాలో పాకిస్థాన్ కూడా ఉన్నది. ఇరాన్, ఖతార్, కువైట్ ఇప్పటికే భారత రాయబార్లకు సమన్లు పంపి తీవ్ర నిరసన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
మండిపడ్డ విపక్షాలు
నూపుర్ శర్మను, జిందాల్ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్, ఎంఐఎం డిమాండ్ చేశాయి. విదేశాల ఒత్తిడితోనే నూపుర్, జిందాల్ను బీజేపీ బహిష్కరించిందని, లేకపోతే వారిని అలాగే పార్టీలో కొనసాగించేవారని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, వామపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ నిర్వాకం వల్ల చిన్న దేశాలు కూడా భారత్ను ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎద్దేవా చేశారు. నూపుర్ సస్పెన్షన్ ఒక డ్రామా అని ఎస్పీ, బీఎస్పీ అభివర్ణించాయి. కఠిన చర్యలకు డిమాండ్ చేశాయి.
సంకుచిత వ్యాఖ్యలు
వివిధ దేశాలు, సంస్థలు ముప్పేట దాడి చేస్తుండటంతో మోదీ సర్కారు ఎదురుదాడికి దిగింది. మైనారిటీల హక్కులను కాలరాసే పాక్ తమకు హితబోధలు చేయవద్దని విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ హితవు పలికారు. మతోన్మాదులకు స్మారకాలను తాము నిర్మించట్లేదని పాక్ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) ప్రతినిధుల వ్యాఖ్యలు సంకుచితంగా, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు.
నూపుర్పై ఎఫ్ఐఆర్
వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక వర్గం మనోభావాలను కించపరిచారన్న ఫిర్యాదు మేరకు నూపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై పోలీసులు సోమవారం తెలిపారు. త్వరలో నూపుర్ను ప్రశ్నించనున్నట్టు పేర్కొన్నారు. నూపుర్పై చర్యలు తీసుకోకపోతే జూన్ 10న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతామని ది ఇట్టేహద్-ఏ-మిల్లట్ కౌన్సిల్ (ఐఎంసీ) సోమవారం హెచ్చరించింది. నూపుర్, జిందాల్పై న్యాయపరమైన చర్యలకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ డిమాండ్ చేసింది.
ఏ దేశాలు/సంస్థలు ఏమన్నాయి?
ఇండోనేషియా: ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను ఆమోదించేది లేదు. భారత దౌత్యవేత్త మోదీ సర్కారుకు ఈ విషయాన్ని తెలియజేయాలి.
యూఏఈ: నైతిక, మానవీయ విలువలు, సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇతర మతాలను గౌరవించాలని తెలియదా?
బహ్రెయిన్: ఇతర మతాల నమ్మకాలను గౌరవించడం ముఖ్యం. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ముకుతాడు వేయాలి.
అఫ్గానిస్థాన్: ఇస్లాంను అవమానించే మతోన్మాదులను అడ్డుకోవాలని భారత్కు విజ్ఞప్తి చేస్తున్నాం.
పాకిస్థాన్: మోదీ పాలనలో భారత్లో మత స్వేచ్ఛను అణగదొక్కేశారు. ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రపంచం దీన్ని ఖండించాలి. ఇండియాను తీవ్రంగా మందలించాలి.
జమైత్ ఉలేమా-ఇ-హింద్: ఇంతకంటే మత విద్వేషం లేదు. ఇంతకంటే పెద్ద నేరం లేదు. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను తప్పకుండా ఖండించాలి. అవమానించినవారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నాం.
ప్రధాని మోదీజీ.. బీజేపీ నాయకుల మతోన్మాద ద్వేషపూరిత ప్రసంగాలకు భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ. రోజురోజుకూ విద్వేషాన్ని చిమ్ముతున్నందుకు, వ్యాప్తి చేస్తున్నందుకు మీ పార్టీ ముందుగా భారతీయులకు క్షమాపణ చెప్పాలి. – ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్