Aftab Poonawala : శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమిన్ పూనావాలా ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. తన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఇప్పించాలని, స్వెటర్ కొనేందుకు తన దగ్గర డబ్బులు లేవని పిటిషన్లో పేర్కొన్నాడు. ‘అఫ్తాబ్ తీహార్ జైలులో చలికి వణికిపోతున్నాడు. అతనికి స్వెటర్, మఫ్లర్ వంటివి కొనేందుకు డబ్బులు కావాలి. అందుకని పోలీసుల దగ్గర ఉన్న అతడి బ్యాంకు కార్డులను ఇప్పించండి’ అని అతని తరఫున పిఎంఎస్ ఖాన్ అనే న్యాయవాది మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా కోర్టులో పిటిషన్ వేశాడు. పోయిన ఏడాది నవంబర్ 9 నుంచి అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. శుక్రవారం అతని జ్యుడిషియల్ కస్టడీని మరో నాలుగు రోజులకు పొడిగించారు. జనవరి 10న జరిగే తదుపరి విచారణకు అతడిని కోర్టులో హాజరు పరచనున్నారు.
సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ను అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని 35 భాగాలు చేసి ఢిల్లీ అటవీ ప్రాంతంలో అక్కడక్కడా పడేశాడు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అఫ్తాబ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి బ్యాంకు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతనికి నార్కోఅనాలసిస్ టెస్టు కూడా చేశారు. శ్రద్ధా ఎముకలను సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.