Sharad Pawar | ముంబై/న్యూఢిల్లీ, జూలై 5: ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శరద్ పవార్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు నేత అజిత్ పవార్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు మీ వయసు 83 ఏండ్లు.. ఇంకెప్పుడు రిటైరవుతారు?’ అని సూటిగా ప్రశ్నించారు. కొన్ని పార్టీల్లో నేతలు ఒక వయసు వచ్చిన తర్వాత పక్కకు తప్పుకొంటున్నారని, అదేవిధంగా మీరు కూడా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని అన్నారు. తిరుగుబాటు అనంతరం రెండు వర్గాలు బుధవారం ముంబైలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా అజిత్ పవార్ వర్గం భేటీకి 29 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా, శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు వచ్చారు.
మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రెండు వర్గాల సమావేశాలకు దూరంగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకొన్నది. రెండు సమావేశాల్లో ఇద్దరు నేతల మాటల తూటాలు పేల్చుకొన్నారు. శరద్ పవార్ తమకు స్ఫూర్తి, తమ నేత, గురువు అంటూనే అజిత్ పవార్ ఆయనపై పంచ్లు వేశారు. 2019లో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శరద్ పవార్ ఐదుసార్లు పార్టీ నేతలతో భేటీలు నిర్వహించారని ఆరోపించారు. వైవీ చవాన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ ‘ఏమైనా సమస్యలు ఉంటే తనతో మాట్లాడాల్సింది’ అంటూ అజిత్ పవార్కు కౌంటర్ ఇచ్చారు.
ఈసీ వద్దకు ఎన్సీపీ ‘వార్’
పార్టీ, ఎన్నికల గుర్తు కోసం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పోరు షురూ అయింది. తమదే ‘అసలైన ఎన్సీపీ’ అని పేర్కొంటూ అజిత్ పవార్ తిరుగుబాటుకు రెండు రోజుల ముందే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్టు తెలిసింది. ఈ మేరకు అజిత్ పవార్ గత నెల 30న లేఖ రాశారని ఈసీ వర్గాలు బుధవారం వెల్లడించాయి.