పనాజీ: గోవాలో వచ్చే నెల 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో పార్టీ అస్త్రశస్త్రాలో రంగంలోకి దిగతున్నాయి. అధికార బీజేపీని ఓడించడానికి శివసేన-ఎన్సీపీ కూటమి, కాంగ్రెస్, ఆప్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్కు బీజేపీ టికెట్ నిరకరించింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాను పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు.
ఉత్పల్ పారికర్ అంశంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఇది మంచితనానికి.. నీతి తక్కువతనానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ‘తాను పనాజీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఉత్పల్ పారికర్ ప్రకటించడంతో.. పనాజీ పోరు ఇప్పుడు మంచితనానికి, నీతి తక్కువ తనానికి మధ్య జరుగుతున్నది’ అని అన్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పనాజీ నుంచి పోటీ చేయాలని ఉత్పల్ భావించారు. అయితే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రెండేండ్ల కింద పార్టీలోకి వచ్చిన అవకాశవాదులకు బీజేపీ టికెట్ ఇచ్చిందని ఉత్పల్ విమర్శించారు.