న్యూఢిల్లీ, జనవరి 7: ప్రపంచంలోనే తొలిసారిగా అరుదైన సర్జరీ చేసి ఎయిమ్స్ వైద్యులు తమ ప్రతిభను చాటారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఐదేండ్ల బాలికను స్పృహలో ఉంచి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒకటో తరగతి చదువుతున్న అక్షిత మూర్ఛతో బాధపడుతుండగా, ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడు ఎడమ భాగంలో కణతులు ఉన్నట్టు గుర్తించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెలకువగానే ఉంచి ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఎయిమ్స్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ దీపక్ గుప్తా బృందం ఆమెను మెలకువగా ఉంచే సర్జరీ పూర్తి చేసింది. వైద్య పరిభాషలో ‘అవేక్ క్రానియోటమీ’గా పిలిచే ఈ ఆపరేషన్ తర్వాత బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలికను స్పృహలో ఉంచే ఆపరేషన్ నిర్వహించినా ఆమెకు నొప్పి కనీస స్థాయిలో ఉండేలా వైద్యులు జాగ్రత్త పడ్డారు. కాగా మెలకువగా ఉండి ఆపరేషన్ చేయించుకున్న అతి చిన్న వయస్కురాలిగా అక్షిత రికార్డులకెక్కింది.