న్యూఢిల్లీ: రెండేళ్ల కిందట లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి తల్లిపై బాధితురాలైన మైనర్ బాలిక తుపాకీతో కాల్పులు జరిపింది. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని భజన్పురా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 2021లో 25 ఏళ్ల వ్యక్తి14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఆ వ్యక్తి జైలులో ఉన్నాడు. నిందితుడి తల్లి పచారీ షాపు నిర్వహిస్తున్నది. శనివారం సాయంత్రం 5.30 గంటలకు లైంగిక దాడి బాధితురాలైన 16 ఏళ్ల బాలిక ఆ షాపు వద్దకు వెళ్లింది. వెంట తెచ్చిన తుపాకీతో 50 ఏళ్ల మహిళపై కాల్పులు జరిపింది. అనంతరం అక్కడి నుంచి ఆమె పారిపోయింది.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ముప్పులేదని వైద్యులు తెలిపారు. ఆ మహిళపై కాల్పులు జరిపిన బాలికను అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల కిందట అత్యాచారం చేసిన నిందితుడి తల్లిపై బాధిత బాలిక ఎందుకు కాల్పులు జరిపింది అన్నది దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కుటుంబంతోపాటు నిందితుడి కుటుంబాన్ని కూడా ప్రశ్నించి కారణాలు తెలుసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.