Ram Mandir Puja schedule | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కనుల పండువగా ముగిసింది. రామజన్మభూమిలోని ఆలయంలో రామ్లల్లా భక్తులకు దర్శనమిచ్చారు. ఇక మంగళవారం నుంచి సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలుగనున్నది. ఈ క్రమంలో రామ మందిరంలో రోజువారీ పూజా కార్యక్రమాలకు సబంధించిన విధివిధానాలు, షెడ్యూల్ ఖరారు చేశారు. ‘శ్రీరామోపాసన’ పేరుతో కోడ్ను రూపొందించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి పూజలు, అలంకరణకు సన్నాహాలు మొదలవుతాయి. వేకువ జామున 4గంటలకు రామ్లల్లాను మేల్కొలుపుతారు. ఇంతకు ముందు ఐదుసార్లు హారతి ఇవ్వగా.. భవిష్యత్లో అనే కూడా అలాగే కొనసాగనున్నది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ రామ్లల్లాకు ప్రతిగంటకు పండ్లు, పాలు అందించనున్నది. ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రస్తుతం ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండడంతో దర్శనానికి 14 నుంచి 15గంటలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. స్వామివారి వస్త్రాలంకరణ, వస్త్రాల రంగు రోజును బట్టి ఉంటుందని పండితులు తెలిపారు. 1949 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం కొనసాగుతుందని తెలిపారు. రామ్లల్లాకు సాధారణ రోజుల్లో సోమవారం తెలుపు రంగు వస్త్రాలు, ప్రత్యేక సందర్భాల్లో పసుపురంగు దుస్తుల్లో అలంకరణ చేస్తారు. మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం లేత పసుపు, క్రీమ్ కలర్ దుస్తులు, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాలను అలంకరిస్తారు. బాల రాముడి కోసం పుణేలోని హెరిటేజ్ అండ్ హ్యాండ్ వీవింగ్ రివైవల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేనేత వస్త్రాలను అయోధ్య ట్రస్ట్ అందించనున్నది.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో మంగళవారం (జనవరి 23) నుంచి బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుంచి గర్భగుడి శుద్ధి, పూజ, అలంకరణకు సన్నాహాలు చేస్తారు. 3.30 నుంచి 4 గంటల వరకు, బాల రాముడిని, శ్రీయంత్రాన్ని మేదమంత్రాలతో మేల్కొలుపుతారు. అనంతరం మంగళ హారతి ఉంటుంది. అనంతరం కుంకుమార్చన, అలంకారం ఉంటుంది. ఆ తర్వాత శృంగార హారతి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు భోగ్ హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రెండు గంటల పాటు దర్శనాలను నిలిపివేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. సాయంత్రం ఏడు గంటలకు మరోసారి హారతి ఉంటుంది.