Raksha Bandan : సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (Raksha Bandan) పండుగ తేదీ సందిగ్ధతపై పంచాంగకర్తలు, పండితులు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28న శుక్రవారం నాడే ఈ పండుగను జరుపుకోవాలని వారు స్పష్టంచేశారు. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ అత్యంత శ్రేష్ఠమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. హిందూ పంచాగం ప్రకారం.. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27, గురువారం ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28, శుక్రవారం ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది.
శాస్త్రోకంగా సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని (ఉదయ తిథి) ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 28వ తేదీనే పౌర్ణమిగా పరిగణించాల్సి ఉంటుంది. దీనికి తోడు 27వ తేదీన ఎక్కువ సమయం ‘భద్ర కాలం’ ఉండటంతో ఆ రోజున శుభకార్యాలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం రాఖీ కట్టేందుకు అత్యంత శుభ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు.
ఢిల్లీలో ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల మధ్య రాఖీ కట్టవచ్చు. ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో సూర్యోదయ సమయాలను బట్టి ముహూర్తాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితమైన సమయాల్లో స్థానిక పంచాంగాలను సంప్రదించడం ఉత్తమమని వారు సూచించారు. అదే రోజున పాక్షిక చంద్రగ్రహణం ఉన్నప్పటికీ అది భారతదేశంలో గోచరించదు. చంద్రుడు క్షితిజం కంటే దిగువన ఉండటంవల్ల ఈ గ్రహణం మనకు కనిపించదు.
ఫలితంగా గ్రహణానికి సంబంధించిన సూతక నియమాలు వర్తించవని, ఎలాంటి ఆటంకాలు లేకుండా రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవచ్చని పండితులు స్పష్టతనిచ్చారు. ఈ శుభ తరుణంలో సోదరీమణులు తమ సోదరుల నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి, రాఖీ కట్టి వారి ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ప్రార్థిస్తారు.