Rajnath Singh | గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు శకటాలు తిరస్కరణకు గురి కావడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము పంపిన నమూనాలు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి కూడా ఈ విషయంపై తమిళనాడు, బెంగాల్ సీఎంలు లేఖలు రాశారు. ఈ వివాదం ముదిరి పాకాన పడుతున్న సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ రంగంలోకి దిగారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖలు రాశారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్రాల శకటాలకు కేంద్రం అనుమతి నిరాకరించిన విషయం విదితమే. దీంతో ఆ ముఖ్యమంత్రులు కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శకటాల ఎంపిక అనేది మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుందని, అందులో అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు.
ఉత్సవాల్లో పాల్గొనాలని రాజ్నాథ్ సీఎం స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు. శకటాల ఎంపిక అనేది అత్యంత పారదర్శకంగానే జరుగుతుందని, మార్గదర్శకాలను అనుసరించే ఎంపిక ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాలు పంపిన డిజైన్లను కమిటీ పరిశీలిస్తుందని, పరిశీలన తర్వాతే తుది నిర్ణయానికి వస్తుందని రాజ్నాథ్ ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకొచ్చారు. 29 రాష్ట్రాలు పంపిన డిజైన్లలో 12 డిజైన్లకు కమిటీ ఆమోదం తెలిపిందని స్టాలిన్ దృష్టికి తీసుకొచ్చారు. 2016,17,19, 2021 గణతంత్ర ఉత్సవాల్లో తమిళనాడు శకటాలు పరేడ్ చేశాయని స్టాలిన్కు రాజ్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్కు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దృష్టికి రాజ్నాథ్ ఈ సందర్భంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆయన జయంతిని పరాక్రమ దివస్గా కూడా జరుపుకుంటున్నామన్నారు. ఇక నుంచి గణతంత్ర ఉత్సవాలు ఆయన జయంతి రోజు నుంచి ప్రారంభమై, జనవరి 30 న ముగుస్తాయని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, గణతంత్ర ఉత్సవాల్లో భాగం కావాలని రాజ్నాథ్ సీఎం బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా తమ రాష్ట్రాల నుంచి పంపిన శకటాల నమూనాలను కేంద్రం తిరస్కరించడంపై తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రం ఓ సారి పునరాలోచించుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. తమ శకటాన్ని కేంద్రం తిరస్కరించడం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని, కారణం చెప్పకుండానే తిరస్కరించడం బాగోలేదని మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తమిళనాడు సీఎం కూడా ఇదే విధమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు.