డెహ్రాడూన్: ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నది. అయితే ఇన్ఫెక్షన్ సోకుతుందన్న కారణంతో వైద్యులు అతడిని ఇవాళ ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్కు షిఫ్ట్ చేశారు. అతనికి పాదాల మీదగానీ, వెన్నెముకపైగానీ, తలపైగానీ ఎలాంటి గాయాలు లేవని ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోషియేషన్ తెలిపింది.
కాగా, ప్రమాదం అనంతరం గాయాలతో ఉన్న రిషబ్పంత్ను రజత్, నిషు అనే ఇద్దరు యువకులు ఆస్పత్రికి తరలించారు. ఆ రోజు పంత్ను ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయిన యువకులు ఇవాళ మరోసారి మ్యాక్స్ ఆస్పత్రికి వచ్చి పంత్ను చూశారు. ఈ సందర్భంగా మీడియా అడగడంతో ఘటనా ప్రాంతం నుంచి పంత్ను ఆస్పత్రికి తీసుకొచ్చిన తీరును ఆ యువకులు వివరించారు.
‘ప్రమాదం జరగగానే మేం అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లాం. అప్పటికి పంత్ కారు నుంచి బయటపడి ఉన్నాడు. అతని పరిస్థితి సీరియస్గా ఉంది. దాంతో మేమిద్దరం అతనికి సాయం పట్టాం. సుశీల్ అనే బస్ డ్రైవర్, ఆ బస్ కండక్టర్ అంబులెన్స్ కోసం 108కు ఫోన్ చేశారు. అప్పుడు అతనెవరో మాకు తెలియదు. కానీ మానవత్వంతో సాయపడ్డాం. వంటిపై దుస్తులు చిరిగిపోవడంతో.. వేరే బట్టలు కప్పాం. అనంతరం అంబులెన్స్లో సాక్షమ్ ఆస్పత్రికి తీసుకెళ్లాం’ అని తెలిపారు.
‘అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా రిషబ్పంత్ నొప్పి అంటూ మూలిగాడు. దాంతో అంబులెన్స్ సిబ్బంది అతనికి పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చారు. గాయాల నుంచి రక్తం వస్తుండటంతో దాన్ని ఆపడానికి తల చుట్టూ దుపట్టా చుట్టాం. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత పంత్ దగ్గర తమకు దొరికిన రూ.4000 లను పోలీసులకు అప్పగించాం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పడిపోయి ఉండటంతో వాటిని మా దగ్గర పెట్టుకున్నాం’ అని చెప్పారు.