జైపూర్: ఒక ప్రభుత్వ వైద్యుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. దీని కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఎన్నికల్లో పోటీకి అనుమతించిన కోర్టు, ఒకవేళ అతడు ఓడిపోతే తిరిగి వైద్య విధుల్లో కొనసాగనివ్వాలని ప్రభుత్వం, వైద్య విభాగాన్ని ఆదేశించింది. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది. 43 ఏళ్ల దీపక్ ఘోగ్రా (Deepak Ghoghra) దుంగార్పూర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) రాష్ట్ర అధ్యక్షుడు వేలారామ్ ఘోగ్రా కుమారుడైన ఆయన రాజకీయాల్లోకి రావాలని భావించాడు.
కాగా, గత పదేళ్లుగా జిల్లా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న గిరిజన డాక్టర్ దీపక్ ఘోగ్రా, ఈ నెల 25 జరుగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. దీనికి అనుమతి కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన జోధ్పూర్ బెంచ్ సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పిటిషనర్ను మెడికల్ ఆఫీసర్ పదవి నుంచి రిలీవ్ చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అలాగే పిటిషనర్ ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే, తిరిగి మెడికల్ ఆఫీసర్ పదవిలో చేరడానికి అనుమతించాలని కోర్టు పేర్కొంది. జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటి నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 20న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం హైకోర్టు అనుమతి ఇవ్వడంతోపాటు ఓడిపోతే ఉద్యోగానికి భరోసా ఇవ్వడంపై డాక్టర్ దీపక్ ఘోగ్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రకమని అన్నారు. ఈ తీర్పు వల్ల చాలా మంది ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులైన విద్యావంతులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తారని చెప్పారు. స్థానిక ప్రజలకు తాను బాగా తెలుసన్న ఆయన ఎన్నికల్లో తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి బన్సీలాల్ కటారా, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రాతో ఆయన తలపడుతున్నారు. బీటీబీ 17 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. దీపక్ ఘోగ్రాతోపాటు మరో డాక్టర్ కూడా ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు.