జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నివాసం వెలుపల రైతులు నిరసనకు దిగారు. బ్యాంకుల బారి నుంచి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. రైతులు తమ రుణాలు చెల్లించలేని పక్షంలో ‘రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ యాక్ట్’ కింద వ్యవసాయ భూములను బ్యాంకులు వేలం వేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా దౌసా రైతులు జైపూర్లోని సీఎం అశోక్ గెహ్లాట్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రుణ మాఫీపై పలుసార్లు హామీలు ఇచ్చారని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దానిని నెరవేర్చలేదని విమర్శించారు. ఒకవైపు అప్పులు తీర్చలేక రైతులు మరణిస్తున్నారని వాపోయారు.
కాగా, ఇటీవల దౌసాకు చెందిన ఒక రైతు అప్పు చెల్లించనందుకు ఆయన పొలాన్ని బ్యాంకు వేలం వేసింది. అయితే అప్పు తీర్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరినప్పటికీ వారు తమ పొలాన్ని వేలం వేశారని రైతు కుమారుడు ఆరోపించారు.
ఈ ఘటన నేపథ్యంలో దౌసా ప్రాంత రైతులు గురువారం జైపూర్కు చేరుకున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నివాసం వద్ద నిరసనకు దిగారు. రైతు రుణాలను మాఫీ చేయాలని, రైతులు తమ రుణాలు చెల్లించలేని పక్షంలో ‘రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ యాక్ట్’ కింద వ్యవసాయ భూములను బ్యాంకులు వేలం వేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.