న్యూఢిల్లీ : రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రాజస్ధాన్లో పార్టీ పరిస్థితితో పాటు రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణపైనా ఇరువురూ చర్చించారు. గెహ్లోత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్ధాన్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ అజయ్ మాకెన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో బుధవారం రాహుల్ నివాసంలో సంప్రదింపులు జరిపారు.
క్యాబినెట్ పునర్వ్యవస్ధీకరణపై గెహ్లోత్ పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘంగా చర్చించారని, ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములాను అనుసరించాలనే అంశంపైనా కసరత్తు సాగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందని గెహ్లోత్ మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలని పార్టీ అగ్రనాయకత్వం కోరుకుంటోందని అన్నారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం మరింత తగ్గించాలని ఆయన కోరారు.