జైపూర్, నవంబర్ 24: అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ భవితవ్యం ఏమిటో తేల్చేందుకు రాజస్థాన్ ఓటర్లు సిద్ధమయ్యారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 199 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలతో పాటు కొత్తగా ప్రకటించిన ఏడు గ్యారెంటీల గురించి అధికార కాంగ్రెస్ విస్త్రృత ప్రచారం నిర్వహించింది. మహిళలపై నేరాలు, అవినీతి, పేపర్ల లీకేజీ అంశాలను బీజేపీ తన ప్రచారాస్ర్తాలుగా మార్చుకొంది.
బీజేపీ 59 మంది సిట్టింగ్లకు టికెట్లివ్వగా.. కాంగ్రెస్ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా.. సీపీఎం, ఆర్ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆప్, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. కాంగ్రెస్, బీజేపీలకు 40 స్థానాల్లో రెబెల్స్ నుంచి పోటీ ఎదురవుతున్నది. రాష్ట్రంలోని మొత్తం 5.25 కోట్ల ఓటర్లలో 18-30 ఏండ్ల వయసు కలిగిన యువత 1.70 కోట్ల మంది ఉన్నారు.