ఉక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని భారత్కు సురక్షితంగా తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అదేమీ సహాయం కాదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరుగొచ్చిన భారతీయ విద్యార్థులకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగానే రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. తాము స్వదేశానికి తిరిగొచ్చే వరకూ తమకు ఎలాంటి సహాయమూ అందలేదని ఆ విద్యార్థి వాపోయినట్లు అందులో ఉంది.
మరోవైపు ఉక్రెయిన్ పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో సలహాలు, సంప్రదింపుల సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్, ఎంపీలు ఆనంద్ శర్మ, శశి థరూర్ హాజరయ్యారు. మొత్తం 21 మంది సభ్యులున్నారు. ఉక్రెయిన్లో పరిస్థితి, భారతీయుల తరలింపు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.