శ్రీనగర్ : భద్రతా కారణాలతో భారత్ జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం శ్రీనగర్ నుంచి తన పాదయాత్రను పునరుద్ధరించారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిని నుంచి మొదలైన పాదయాత్ర ముగింపు సంకేతంగా శ్రీనగర్లోని లాల్చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
#WATCH | Jammu and Kashmir: Congress MP Rahul Gandhi unfurls the national flag at Lal Chowk in Srinagar. pic.twitter.com/I4BmoMExfP
— ANI (@ANI) January 29, 2023
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజ్యసభ ఎంపీ రణ్దీప్ సింగ్ సుర్జీవాలా పాదయాత్ర చివరి అంకంలో రాహుల్ వెంట నడిచారు. అంతకుముందు పంథా చౌక్ నుంచి రాహుల్ పాదయాత్రను పునరుద్ధరించగా మధ్యాహ్నం సొన్వర్ చౌక్ వద్ద విరామం తీసుకున్నారు. వైట్ టీ షర్ట్ ధరించిన రాహుల్ యాత్రలో ఉత్సాహంగా నడిచారు.
లాల్ చౌక్ అంతటా పెద్దసంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం ఎస్కే స్టేడియంలో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు. ఈ సభకు హాజరుకావాలని 23 విపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించగా 12 విపక్ష పార్టీలు హాజరవుతాయని భావిస్తున్నారు. శనివారం జోడో యాత్రలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఇక భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్లోని తాజ్ వివాంటాలో రాత్రి 7 గంటలకు పార్టీ నేతలకు విందు ఇవ్వనున్నారు.