పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికి ఎదుటివారి పట్ల హూందాగా, ఉదారస్వభావంతో వ్యవహరించడం చాలా ముఖ్యమని చెబుతోంది బాలీవుడ్ యువ కథానాయకి జాన్వీకపూర్. ఇటీవలే ఆమె తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్లో తన రెండేళ్ల ప్రయాణం గురించి ముచ్చటించింది. పరిశ్రమలో విజయాలు సాధించడం కంటే మంచి వ్యక్తిత్వంతో కొనసాగడానికి తాను ప్రాధాన్యతనిస్తానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘అసూయద్వేషాలకు అతీతంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని అమ్మనాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. వాళ్ల మాటల్ని ప్రతి సందర్భంలో గుర్తుతెచ్చుకుంటా. ఇండస్ట్రీలో ఈగో పరమైన విభేదాల వల్లే ఎక్కువ సమస్యలొస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఓ మెట్టు దిగితే తప్పుకాదనుకుంటా. వినమ్రంగా ఉన్నవారిలో పరిణితి ఎక్కువగా ఉంటుందని, వారే జీవితంలో ఉన్నతశిఖరాల్ని అధిరోహిస్తారని నా పేరెంట్స్ చెప్పిన మాటలు శిరోధార్యంగా భావిస్తా’ అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్లో ‘రూహీ’ ‘దోస్తానా’ ‘గుడ్లక్ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.