న్యూఢిల్లీ, మే 24: కుతుబ్మినార్ కాంప్లెక్స్ లోపల హిందూ, జైన ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్ను భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) మంగళవారం వ్యతిరేకించింది. కుతుబ్మినార్ ప్రార్థనా స్థలం కాదని, ఈ చిహ్నం ప్రస్తుత స్థితిని మార్చలేమని పేర్కొన్నది. ఏఎస్ఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నిఖిల్ చోప్రా.. పిటిషన్పై ఉత్తర్వులను జూన్ 9వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు జ్ఞాన్వాపీ-శృంగర్ గౌరీ కాంప్లెక్స్పై వారణాసి జిల్లా కోర్టు గురువారం వాదనలు విననున్నది. జ్ఞాన్వాపీ కాంప్లెక్స్లో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయని, పూజలకు అనుమతివ్వాలని పలువురు హిందువులు పిటిషన్ వేశారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ ప్రార్థనా స్థలాల చట్టం-1991కి ఉల్లంఘిస్తున్నదని పేర్కొంటూ మసీదు కమిటీ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై జడ్జి ఎకే విశ్వేష్ వాదనలు వింటారని జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాణా సంజీవ్ సింగ్ తెలిపారు. జ్ఞాన్వాపీ మసీదు పరిసరాల్లో జరిగిన సర్వే నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు హిందూ, ముస్లిం పక్షాలకు వారం రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు.