చండీగఢ్, జనవరి 8: ‘మీరు చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకొన్న చోటుకు విమానంలో పంపిస్తా’ అని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరిట్ సాధించారు కూడా. దీంతో ఆ ప్రిన్సిపాల్ ఇచ్చిన మాట ప్రకారం.. ఇద్దరిని విమానం ఎక్కించారు. మరో ఇద్దరిని నెలాఖరులో విమానం ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఘటన పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో జరిగింది. అక్కడి జిరాలో షాహీద్ గురుదాస్ రామ్ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల (బాలికలు)లో రాకేశ్ శర్మ ప్రిన్సిపాల్గా ఉన్నారు. చదువులో తమ పాఠశాల వెనుకబడి ఉండటాన్ని గమనించిన ఆయన బోర్డు పరీక్షల్లో ర్యాంకు తెచ్చుకున్న వారిని తన సొంత డబ్బులతో దేశంలో వారు కోరుకున్న ప్రదేశానికి విమానంలో పంపిస్తానని హామీ ఇచ్చారు. ఆయన కోరిక నెరవేరుస్తూ గత 12 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు పదో తరగతి, మరో ఇద్దరు 12 బోర్డు పరీక్షల్లో మెరిట్ ర్యాంకులు సాధించారు. దీంతో ఆ ప్రిన్సిపాల్ 12వ తరగతి బాలికలను అమృతసర్ నుంచి గోవాకు పంపించారు.