న్యూఢిల్లీ: పంజాబ్ కొత్త సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ వల్ల మహిళల భద్రతకు ముప్పు ఉన్నదని జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్పర్సన్ రేఖా శర్మ ఆరోపించారు. 2018లో ‘మీ టూ’ ఉద్యమం సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్నదని అన్నారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నాడు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ధర్నా చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు.
ఈ రోజు ఒక మహిళ నేతృత్వంలోని పార్టీ ద్వారా చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇది ద్రోహమని రేఖా శర్మ విమర్శించారు. ఆయన వల్ల మహిళల భద్రతకు ముప్పు ఉందన్నారు. చన్నీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి అర్హుడు కాదన్నారు. చన్నీని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తాను కోరుతున్నానని అన్నారు.