చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ఇటీవల తన మంత్రివర్గంలో చేరిన వారికి ఇవాళ శాఖలు కేటాయించారు. అయితే తన క్యాబినెట్ సహచరులకు పంచగా మిగిలిన 14 శాఖలను తన దగ్గరే అట్టి పెట్టుకున్నారు. ప్రస్తుతం చరణ్జీత్ దగ్గర విద్యుత్, విజిలెన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, జస్టిస్, సివిల్ ఏవియేషన్, పర్యావరణం, లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్, మైనింగ్ అండ్ జియాలజీ, ఎక్సైజ్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, హాస్పిటాలిటీ, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖలు ఉన్నాయి.
ఇక ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రణ్ధవాకు హోం శాఖ, సహకార శాఖ, జైళ్ల శాఖలను కేటాయించారు. మరో ఉప ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ సోనికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రక్షణ సేవలు, స్వాతంత్ర్య సమరయోధుల సంక్షేమ శాఖలు అప్పగించారు. బ్రహ్మ్ మొహింద్రాకు లోకల్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఎఫైర్స్, ఎలక్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ గ్రీవియెన్సెస్ శాఖలను కట్టబెట్టారు.
మరో మంత్రి మన్ప్రీత్సింగ్ బాదల్కు ఫైనాన్స్, ట్యాక్సేషన్, గవర్నెన్స్ రిఫార్మ్స్, ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖలు కేటాయించారు. ఇంకో మంత్రి త్రిప్త్ రాజిందర్ సింగ్ బజ్వాకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్ అండ్ డెయిరీ డెవలప్మెంట్ శాఖలను అప్పగించారు. అరుణా చౌదరికి రెవెన్యూ, రిహాబిలిటేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలను ఇచ్చారు. సుఖ్బిందర్ సింగ్ సర్కారియాకు జలవనరులు, హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలను అప్పగించారు.
ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్సింగ్కు సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణ, ఉపాధి కల్పన & శిక్షణ శాఖలను కేటాయించారు. రజియా సుల్తానాకు తాగునిటి సరఫరా, పారిశుద్ధ్యం, సామాజిక భద్రత, మహిళా శిశు సంక్షేమ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖలను కట్టబెట్టారు. విజయ్ ఇందర్ సింగ్లాకు పబ్లిక్ వర్క్స్, పరిపాలనా సంస్కరణల శాఖలు అప్పగించారు.