ముంబై: మహారాష్ట్రలోని ఫూణేలో మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన యువకుడ్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియల్టర్ కుమారుడైన 17 ఏళ్ల యువకుడి రక్త పరీక్ష నివేదికను తారుమారు చేసేందుకు ఇద్దరు డాక్టర్లు ప్రయత్నించారు. (Pune Porsche horror) పోలీసుల దర్యాప్తులో ఈ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ససూన్ ఆసుపత్రిలో ఈ నెల 19న యువకుడి నుంచి సేకరించిన రక్త నమూనాను డస్ట్బిన్లోకి విసిరేసినట్లు పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలుసుకున్నారు.
కాగా, ససూన్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అజయ్ తవాడే సూచనల మేరకు డాక్టర్ శ్రీహరి హల్నోర్ రక్త నమానాలు మార్పిడి చేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇద్దరు వైద్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజున డాక్టర్ అజయ్తో నిందితుడైన యువకుడి తండ్రి ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి రక్త పరీక్ష నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ అజయ్, డాక్టర్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు.