జైపూర్: ట్రాఫిక్ పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తన వాహనాన్ని వేగంగా నడిపాడు. ఈ క్రమంలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు (driver rams cop’s car ). ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి, పోలీస్ అధికారి మరణించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నాగౌర్ ప్రాంతానికి చెందిన హరిశంకర్ వైష్ణవ్ మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో ఎస్యూవీని అతి వేగంగా డ్రైవ్ చేశాడు. అలాగే ఎవరితోనో ఫోన్లో గొడవ పడుతూ వాహనాన్ని నడిపాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు జోధ్పూర్-నాగౌర్ హైవేపై అతడి వాహనాన్ని అడ్డుకుని ఆపారు.
కాగా, చలాన్ విధించేందుకు వచ్చిన పోలీస్తో హరిశంకర్ వాగ్వాదానికి దిగాడు. అలాగే అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఎస్యూవీని 120 కిలోమీటర్ల వేగంతో రాంగ్ సైడ్ నుంచి నడిపాడు. ఈ నేపథ్యంలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. అతడి వాహనం కూడా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
మరోవైపు ఈ సంఘటనలో పోలీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న ఏఎస్ఐ భవర్లాల్ బిష్ణోయ్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీస్ కానిస్టేబుల్ అశోక్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ డ్రైవర్ హరిశంకర్ వైష్ణవ్ కూడా సంఘటనా స్థలంలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.