IFPRI | కాఠ్మాండూ: భారత్లో పోషకాహార లోప సమస్య, ప్రధానంగా సూక్ష్మ పోషకాల లోపం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని ఆహార నిపుణులు పేర్కొన్నారు. దేశంలో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్న ఈ ‘పైకి కనిపించని ఆకలి’ సమస్యను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార పాలసీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఎఫ్పీఆర్ఐ) ఇటీవల ది గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్టు(జీఎఫ్పీఆర్)-2023 పేరుతో నివేదిక విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య 2021 నాటికి 76.8 కోట్లకు పెరిగింది. ఇది 2014లో 57.2 కోట్లుగా ఉండగా.. 2021కి 34.2 శాతం పెరిగిందని నివేదిక పేర్కొన్నది. పోషకాహార లోప సమస్య 2019-21 మధ్యలో ఆఫ్గానిస్థాన్లో 30 శాతం, పాకిస్థాన్లో 17%, భారత్లో 16%, బంగ్లాదేశ్లో 12%, నేపాల్లో 6 శాతం, శ్రీలంకలో 4 శాతంగా ఉన్నదని తెలిపింది.
ప్రజలకు చేరడంలో సమస్యలు..
భారత్లో ఆహార ఉత్పత్తి, లభ్యత మెరుగ్గానే ఉన్నప్పటికీ, అవి ప్రజలకు చేరడంలో సమస్యలు ఉన్నాయని ఐఎఫ్పీఆర్ఐ దక్షిణాసియా డైరెక్టర్ షాహిదుర్ రషీద్ పేర్కొన్నారు. ఆరోగ్యానికి బియ్యం, గోధుమలు వంటి ఆహార పదార్థాలు తింటే సరిపోదని, వాటి ద్వారా అందుతున్న పోషకాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సూక్ష్మ పోషకాల లోపంగా పిలిచే ‘పైకి కనిపించని ఆకలి(హిడెన్ హంగర్)’ భారత్తో సహా దక్షిణాసియా ప్రాంతాల్లో అధికంగా ఉన్నదని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు తరాల కోసం సరిపడా సూక్ష్మ పోషకాలను అందించే మార్గాలపై ఆలోచన చేయాలని సూచించారు.
పర్యావరణ మార్పులతో పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా బియ్యం, గోధుమలు వంటి పంటల్లో పోషకాల నాణ్యత తగ్గుతుందని ఇంటర్నేషన్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఆర్ఆర్ఐ) ప్రతినిధి రంజితా పుష్కర్ పేర్కొన్నారు. పోషకాహార భద్రత కోసం ప్రత్యేక విధానం ఉండాల్సిన అవసరం ఉన్నదని అగ్రికల్చర్ ఎకనమిక్స్ రిసెర్చ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రమోద్ జోషి అభిప్రాయపడ్డారు.