లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో 17 రోజులుగా ఒక వ్యక్తి మృతదేహం ఉంది. దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. మార్చురీలో మృతదేహం ఉన్న సంగతిని ఆసుపత్రి సిబ్బంది మరిచారు. (Hospital Forgets Body In Freezer) ఈ నేపథ్యంలో దీనిపై విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. జూలై 22న 70 ఏళ్ల వ్యక్తిని గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చేర్చారు.సెప్టెంబర్ 23న బ్రెయిన్ స్ట్రోక్తో ఆ రోగి మరణించాడు.
కాగా, ఆ వృద్ధుడ్ని ఆసుపత్రికి తీసుకువచ్చిన వ్యక్తి ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది రోగి మృతదేహాన్ని మార్చురీలోని ఫ్రీజర్లో ఉంచారు. అనంతరం దాని గురించి మరిచిపోయారు. అయితే 17 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ బాధ్యతలు చూస్తున్న బ్రజేష్ పాఠక్ దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు.