పార్లమెంట్లో ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టేది ఆర్థిక మంత్రి అని మనకు తెలుసు. ఇది సాధారణంగా జరిగిపోతున్నదే. అయితే, మన దేశ చరిత్రలో ఆర్థిక మంత్రులకు బదులుగా ముగ్గురు ప్రధానులు బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఎందుకిలా జరిగింది..? ప్రధానులు బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి రావడానికి గల కారణాలేంటి..? అనే విషయాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర ఆంశాలు తెలుస్తాయి. ఇంతకీ ఆర్థిక మంత్రులకు బదులుగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులు.. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, యువ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ. ఈ ముగ్గురూ ఒకే కుటుంబానికి, ఒకే పార్టీకి చెందిన వారు కూడా కావడం విశేషం.
పార్లమెంట్లో తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ దేశ చరిత్రలో నిలిచిపోయారు. 1958-59 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను నెహ్రూ లోక్సభలో సమర్పించారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న టీటీ కృష్ణమాచారి పేరు ముంద్రా కుంభకోణంలో రావడంతో బడ్జెట్కు ముందు రాజీనామా చేయాల్సి వచ్చింది. నెహ్రూ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. సాధారణ బడ్జెట్ను సమర్పించారు. నెహ్రూ బడ్జెట్లో ముఖ్య అంశం ఏంటంటే.. రూ. 10,000 కంటే ఎక్కువ ఆస్తిని బదిలీ చేయడంపై బహుమతి పన్నును తీసుకొచ్చారు. భార్యకు లక్ష రూపాయల వరకు బహుమతులు ఇస్తే పన్ను వర్తించదనే మినహాయింపు కూడా ఇచ్చారు.
దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసి ఇందిరా గాంధీ చరిత్ర సృష్టించారు. 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఉప ప్రధాని పదవితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా మొరార్జీ దేశాయ్ నిర్వహిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావటంతో ఆయన పార్టీలో తిరుగుబాటుకు దిగారు. 1969 నవంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. దాంతో ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వీకరించారు. 1970 ఫిబ్రవరి 28 న బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఇందిరా గాంధీ పరోక్ష పన్నులో పెద్ద నిర్ణయం తీసుకున్నారు. దీని కింద సిగరెట్లపై పన్నును 3 శాతం నుంచి ఏకంగా 22 శాతానికి నేరుగా పెంచారు.
ఇందిరా గాంధీ మరణంతో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. 1987-88 బడ్జెట్ను ఆయన సమర్పించారు. రాజీవ్ గాంధీతో వివాదం తర్వాత ఆర్థిక మంత్రి వీపీ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆర్థిక శాఖను తన వద్ద ఉంచుకుని రాజీవ్ గాంధీ పార్లమెంట్కు సాధారణ బడ్జెట్ను సమర్పించారు. రాజీవ్ గాంధీ తన బడ్జెట్లో ముఖ్యంగా.. కార్పొరేట్ పన్ను ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. దీనిని కనీస ప్రత్యామ్నాయ పన్ను అని కూడా పేర్కొన్నారు.