న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి అస్సాంలోని డిబ్రూఘర్ వరకు ప్రయాణించే గంగా విలాస్ క్రూయిజ్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ నౌకకు పచ్చజెండా ఊపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడుగైన క్రూయిజ్ సర్వీసుగా నిలువనున్నది. మూడు డెక్స్ ఉన్న ఆ భారీ పడవ.. సుమారు 50 రోజుల పాటు ప్రయాణించనున్నది. 32 మంది స్విజ్ ప్రయాణికులతో క్రూయిజ్ సర్వీసు ప్రారంభమైంది.
వారణాసి నుంచి డిబ్రూఘర్ వరకు 3200 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రయాణ సమయంలో గంగా నదితో పాటు మరో 27 ఉపనదుల మీదుగా ఆ క్రూయిజ్ సాగుతుంది. ఆ సమయంలో ప్రపంచ వారసత్వ సంపదకు చెందిన సుమారు 50 టూరిస్టు సైట్లను కూడా పర్యాటకులు విజిట్ చేస్తారు. ఒక్కొక్క పర్యాటకుడికి సుమారు 20 లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రూయిజ్ డైరెక్టర్ రాజ్ సింగ్ తెలిపారు.
క్రూయిజ్ సామర్థ్యం 80 మంది ప్రయాణికులు. దీంట్లో మొత్తం 18 సూట్లు ఉంటాయి. అన్ని సౌకర్యాల్ని ఇందులో పొందుపరిచారు. రెస్టారెంట్, స్పా, సన్డెక్ కూడా ఏర్పాటు చేశారు. అప్పర్ డెక్లో ఓ బార్ కూడా ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2020లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యం అయ్యింది.
వారణాసి నుంచి గంగా విలాస్ క్రూయిజ్ ఎనిమిది రోజుల్లో పాట్నా చేరుకోనున్నది. బక్సర్, రామ్నగర్, ఘాజీపూర్ మీదుగా వెళ్తుంది. ఆ తర్వాత మరో 20 రోజుల్లో పఱక్కా, ముర్షీదాబాద్ మీదుగా కోల్కతాకు వెళ్తుంది. అక్కడ నుంచి బంగ్లా రాజధాని ఢాకా వెళ్తుంది. ఇక బంగ్లా నదుల్లోనే 15 రోజుల ప్రయాణం ఉంటుంది. మళ్లీ ఇండియాలోకి గౌహతి వద్ద ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత చివరకు డిబ్రూఘర్ చేరుకుంటుంది.
PM Narendra Modi flags off the world's longest river cruise MV Ganga Vilas between Varanasi in Uttar Pradesh and Dibrugarh in Assam pic.twitter.com/nGH54SQpt9
— ANI (@ANI) January 13, 2023