CAR T-Cell Therapy | ముంబై, ఏప్రిల్ 4: ప్రాణాంతక క్యాన్సర్ బాధితులకు అందించే చికిత్సలో కీలక ముందడుగు పడింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టార్(సీఏఆర్) టీ-సెల్ థెరపీని గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. క్యాన్సర్తో పోరాడుతున్న బాధితుల ప్రాణాలను రక్షించడంలో ఈ చికిత్స ఇక మీదట చాలా కీలకం కానున్నది. ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ కలిసి అభివృద్ధి చేసిన ఈ సీఏఆర్ టీ-సెల్ థెరపీకి ‘నెక్స్కార్19’ అని పేరు పెట్టారు. వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో ఈ జన్యు ఆధారిత థెరపీ సమర్థంగా పని చేస్తున్నది. ఐఐటీ బాంబేలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… వైద్యశాస్త్రంలో సీఏఆర్ టీ-సెల్ థెరపీ అద్భుతమైన పురోగతి అని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇది ఒక ఉదాహరణ అని, భారతీయ శాస్త్రవేత్తలు, వైద్యుల సామర్థ్యాన్ని ఇది చాటుతున్నదని అన్నారు.
సీఏఆర్ టీ-సెల్ థెరపీ చాలా ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల ఇంతకాలం మన దేశంలోని మెజారిటీ క్యాన్సర్ రోగులు దీనిని పొందలేకపోయారని టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ సుదీప్ గుప్తా తెలిపారు. ‘నెక్స్కార్19’ ద్వారా విదేశాల్లో అయ్యే ఖర్చులో పదో వంతుతోనే భారత్లోని క్యాన్సర్ బాధితులకు సీఏఆర్ టీ-సెల్ థెరపీ అందించవచ్చని తెలిపారు. జెనెటిక్ ఇంజినీరింగ్, క్యాన్సర్ చికిత్సలో ఇది చారిత్రక మైలురాయని పేర్కొన్నారు. ఇది ఎంతో డబ్బుని, ఎన్నో ప్రాణాలను కాపాడబోతున్నదని, కన్నీటిని దూరం చేయబోతున్నదని తెలిపారు.
దశాబ్దాలుగా మానవాళికి సవాల్గా మారిన క్యాన్సర్ వ్యాధికి మొదట సర్జరీ, ఆ తర్వాత కీమోథెరపీ, రెడియేషన్ థెరపీ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. తర్వాతి కాలంలో శాస్త్రవేత్తలు సీఏఆర్ టీ-సెల్ థెరపీని అభివృద్ధి చేశారు. 2017లో ఈ చికిత్సకు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఆమోదించింది. క్యాన్సర్ చికిత్సలో దీని పనితీరు బాగుందని వైద్యులు శాస్త్రీయంగా గుర్తించడంతో మొదట అమెరికాలో ఆ తర్వాత పలు దేశాల్లో ఈ చికిత్స అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ చికిత్స ఖర్చు భారీగా ఉండటం వల్ల అందరూ చేయించుకోలేకపోయారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చికిత్సకు దాదాపు రూ.4 కోట్లు ఖర్చు అవుతున్నది. ఇప్పుడు భారత్లో దేశీయంగా ఈ చికిత్సను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవడంతో ఈ ఖర్చు గణనీయంగా తగ్గిపోనున్నది.
సీఏఆర్ టీ-సెల్ థెరపీ అంటే చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టార్ టీ-సెల్ థెరపీ. ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ రోగులకు సజీవమైన ఔషధాన్ని అందించే చికిత్స ఇది. ఐదు దశల్లో ఈ చికిత్స ఉంటుంది. ముందుగా రోగి రక్తాన్ని సేకరించి అందులో నుంచి టీ-సెల్స్ను వేరు చేస్తారు. ల్యాబ్లో ఈ టీ-సెల్స్లోకి సీఏఆర్ అనే క్యాన్సర్తో పోరాడే జన్యువును చొప్పిస్తారు. మూడో దశలో ల్యాబ్లోనే సీఏఆర్తో కూడిన టీ-సెల్స్ను కోట్ల సంఖ్యలో అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత ఈ సీఏఆర్ టీ-సెల్స్ను మళ్లీ రోగి రక్తంలోకి పంపిస్తారు. ఈ టీ-సెల్స్ శరీరంలోని క్యాన్సర్ కణాలను గుర్తించి అంతం చేస్తాయి. సీఏఆర్ టీ-సెల్ థెరపీ తీసుకునే వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ క్యాన్సర్ చికిత్సలో దీని సామర్థ్యం బాగుంటుందని వైద్యులు చెప్తున్నారు.