ఢిల్లీలో జరిగినట్లుగా, మహారాష్ట్రలోనూ అల్లర్లు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఆరోపించారు. మహారాష్ట్ర వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వాటికి దగ్గ సమాచారం తమకు అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని, తాము పోలీసులను అలర్ట్ చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను సజావుగా ఉంచడం తమ కర్తవ్యమని, అయితే… శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆయన ఆరోపించారు.
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. వాటిని ఆపని పక్షంలో తాము కూడా హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా ప్లే చేస్తామని రాజ్ థాకరే హెచ్చరించిన విషయం తెలిసిందే. మే 3 తేదీ లోపల లౌడ్ స్పీకర్ల నిషేధంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని రాజ్థాకరే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.