RSS | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రసార భారతి( Prasar Bharati )లో ఇకపై ప్రసారమయ్యే వార్తలన్నింటినీ ఆరెస్సెస్ ( RSS ) అనుబంధ హిందుస్థాన్ సమాచార్ ( Hindustan Samachar ) ఇవ్వనున్నది. ఈ మేరకు రెండేండ్ల కాంట్రాక్ట్కు రూ. 7.7 కోట్లు చెల్లించి మరీ కేంద్రం ఒప్పందం చేసుకొన్నదని ‘ది వైర్’ ( the wire ) పేర్కొన్నది. డీల్లో భాగంగా రోజుకు కనీసం 100 వార్తలను హిందుస్థాన్ సమాచార్.. ప్రసార భారతి నేతృత్వంలో పనిచేస్తున్న దూరదర్శన్( doordarshan ), ఆలిండియా రేడియో( All India Radio )కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో పది వార్తలు జాతీయ సంబంధమైనవి కాగా, 40 స్థానిక వార్తలు ఉండాలి. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూల వార్తలను ప్రసారం చేసుకోవడంలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆరెస్సెస్ అనుబంధ ఏజెన్సీకి ఈ డీల్ కట్టబెట్టినట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ వార్తా ఏజెన్సీలు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ)లతో గత కొన్ని ఏం డ్లుగా బీజేపీ సర్కారుకు పొసగట్లేదు. ఆ వార్తా ఏజెన్సీలు తాము చెప్పినట్టు నడుచుకోకపోవడం, ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలను ప్రసారం చేయకపోవడమే అందుకు కారణమనే వాదనలు వినిపించాయి. దీంతో ప్రసార భారతికి పీటీఐతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రక్రియను పక్కనబెట్టిన బీజేపీ సర్కా రు.. ఆ కాంట్రాక్టును హిందుస్థాన్ సమాచార్ కు కట్టబెట్టింది. పీటీఐ ఎక్కువ చార్జీ చేస్తుండటంతోనే డీల్ను మరో ఏజెన్సీకి ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే అస లు మర్మమేంటో అర్థమవుతున్నది. పీటీఐని ప్రభావితం చేసేందుకు 2016లో మోదీ సర్కారు విఫలయత్నం చేసింది. ఎడిటర్-ఇన్-చీఫ్గా రజ్దాన్ దిగిపోగానే, ఆ పదవిలో తమకు అనుకూలమైన వ్యక్తిని నామినేట్ చేయాలని పీటీఐ బోర్డుకు సిఫారసులు పం పింది. పీటీఐ బోర్డు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంతోనే నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.
హిందుస్థాన్ సమాచార్ సంస్థను 1948లో శివ్రామ్ శంకర్ ఆప్టే ప్రారంభించారు. ఈయన విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరు. వీహెచ్పీకి తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం దీనికి అర్వింద్ భల్చంద్ మండ్రికర్ చైర్మన్గా ఉన్నారు. ఈ సంస్థ నిధుల కొరతతో 1986లోనే మూత పడింది. వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ మద్దతుతో 2002లో ఆర్ఎస్ఎస్ దీనిని మళ్లీ ప్రారంభించిందని చెప్తారు. 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక హిందుస్థాన్ సమాచార్ దశ తిరిగింది. అప్పటి నుంచి ఈ ఏజెన్సీకి కేంద్రం నుంచి క్రమం తప్పకుండా ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని ఝందేవాలన్ సమీపంలోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పక్కనే ఉన్నది. ఇది చాలా చిన్న ఆఫీస్.. తాజాగా నోయిడాలో భారీ ఆఫీస్లోకి మారాలని చూస్తున్నట్టు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ వార్తలను నిస్పక్షపాతంగా అందిస్తున్న దేశంలోనే అతిపెద్ద వార్తా ఏజెన్సీలను పక్కనబెట్టి, ఆఫీస్ కూడా సరిగా లేని హిందుస్థాన్ సమాచార్కు మోదీ సర్కారు కాంట్రాక్టు ఇవ్వటంలోనే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.