Ponty Chadda: ఉత్తరప్రదేశ్కు చెందిన లిక్కర్ కింగ్ పాంటీ చద్దా (Ponty Chadha) కు సంబంధించిన వందల కోట్ల విలువైన ఫామ్హౌజ్ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్రపూర్ ఏరియాలో లిక్కర్ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి ఫామ్హౌజ్ ఉంది. ఆ ఫామ్ హౌజ్ విలువ రూ.400 కోట్ల కంటే పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పాంటీ చద్దా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ ఫామ్హౌజ్ను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దాంతో శుక్ర, శనివారాలు సామగ్రితో వచ్చి ఆ ఫామ్హౌజ్ను పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రస్తుతం ఈ ఫామ్హౌజ్ పాంటీ చద్దా కుమారుడు మన్ప్రీత్ అలియాస్ మాంటీ చద్దా కబ్జాలో ఉంది. ఈ ఫామ్హౌజ్లోనే గతంలో పాంటీ చద్దా, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ గొడవపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గొడవ ముదరడంతో హర్దీప్ తన అన్న పాంటీ చద్దాను తుపాకీతో కాల్చిచంపాడు. దాంతో పాంటీ అంగరక్షకుడు హర్దీప్ను కాల్చేశాడు. తన అన్నదమ్ములిద్దరూ క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, ‘ఢిల్లీలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో పాంటీ చద్దా అలియాస్ గురుదీప్ సింగ్ అక్రమంగా నిర్మించిన ఫామ్హౌస్ను కూడా కూల్చివేశాం’ అని అధికారులు తెలిపారు.
పాంటీ ఫామ్హౌజ్ ఛత్రపూర్లో దాదాపు పది ఎకరాలకుపైగా భూమిలో విస్తరించి ఉంది. దీని విలువ రూ.400 కోట్లని డీడీఏ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఐదెకరాలను స్వాధీనం చేసుకోగా.. శనివారం ప్రధాన భవనాన్ని కూల్చివేసి మిగిలిన భూమిని ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలిపారు. ఫామ్ హౌజ్లో గార్డెన్, ఔట్ హౌజ్, ప్రధాన భవనం ఉన్నాయి. ఈ ఘటనపై చద్దాకు చెందిన వేవ్ గ్రూప్ స్పందించలేదు. ఈ గ్రూప్ యూపీలో లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తోంది.