రాంచీ: ఒక బాలికపై పోలీస్ అధికారి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. (police official rapes minor ) ఇటీవల కడుపు నొప్పితో బాధపడిన బాధితురాలు దీని గురించి తల్లికి చెప్పింది. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. శుక్దేవ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నీరజ్ ఖోస్లా, గత ఏడాదిగా మైనర్ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. నవంబర్ 10న బాధిత బాలిక కడుపు నొప్పితో బాధపడింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారి లైంగిక దాడి గురించి తల్లికి చెప్పింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 14న నిందితుడైన ఏఎస్ఐ నీరజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పోలీస్ అధికారి కుటుంబం నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి తల్లి ఆరోపించింది. నిర్మాణ స్థలంలో పని చేసే తన భర్తపై దాడి చేసి కొట్టినట్లు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.