కాఠ్మాండు: నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దాహల్ ప్రచండ(Nepal PM Prachanda) ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో దుమారం రేపుతున్నాయి. తనను ప్రధానిగా చేసేందుకు గతంలో భారత్కు చెందిన ఓ వ్యాపారవేత్త ప్రయత్నాలు చేసినట్లు ప్రచండ అన్నారు. ఆ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ప్రధాని ప్రచండ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
నేపాల్లో ఉన్న వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ .. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రచండ తెలిపారు. ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి అనేక సార్లు వెళ్లారని, ఆ తర్వాత కాఠ్మాండులో కూడా అనేక మీటింగ్లు పెట్టారని ప్రపంచ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నేపాల్లో విమర్శలు వస్తున్నాయి.
ప్రధాన ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ బుధవారం జాతీయ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకున్నది. ప్రధాని ప్రచండ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ప్రధాని వ్యాఖ్యలు దేశ స్వాతంత్య్రాన్ని, హుందాతనాన్ని, రాజ్యాంగాన్ని, పార్లమెంట్ను ఖూనీ చేసినట్లు ఉందని విపక్షాలు ఆరోపించాయి. న్యూఢిల్లీ నియమించిన ప్రధాని మాకు వద్దు అంటూ ప్రతిపక్షం నినాదాలు చేసింది. ఇవాళ కూడా ఇదే అంశంపై ఉభయసభలు వాయిదాపడ్డాయి.