న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే వంద కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో భేటీ కానున్నారు. ఏడు వ్యాక్సిన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, జైడస్ క్యాడిల్లా, బయోలాజికల్ ఈ, జెన్నోవా బయోఫార్మా, పనేసియా బయోటెక్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో మోదీ భేటీకానున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ, సహాయ మంత్రి భారతి ప్రవిన్ పవార్లు కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు. అక్టోబర్ 21వ తేదీన ఇండియా సరికొత్త మైలురాయిని అందుకున్నది. వంద కోట్ల కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దేశంలోని వయోజనుల్లో 75 శాతం మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు.