పాట్నా: ఒక యూనివర్సిటీ అడ్మిట్ కార్డులపై ప్రధాని మోదీ, బీహార్ గవర్నర్, క్రికెటర్ ఎంఎస్ ధోనీ తదితరుల ఫొటోలున్నాయి. దీనిపై స్పందించిన ఆ యూనివర్సిటీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. బీహార్ రాష్ట్రం దర్భంగాలోని లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయంలో ఈ సంఘటన జరిగింది. మధుబని, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో చదువుతున్న బీఏ పార్ట్ 3 విద్యార్థుల పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్, స్టార్ క్రికెట్ ఎంఎస్ ధోని వంటి ఫొటోలున్నాయి. ఈ అడ్మిట్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఆ యూనివర్సిటీ రిజిస్టార్ ముస్తాక్ అహ్మద్ దీనిపై సీరియస్గా స్పందించారు. పరీక్షల అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో జారీ చేసినట్లు చెప్పారు. దీని కోసం ప్రతి విద్యార్థికి ప్రత్యేక లాగిన్, ఐడీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే కొందరు విద్యార్థులు ఆకతాయిగా తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేశారని ఆరోపించారు. యూనివర్సిటీ గౌరవానికి భంగం కలిగించిన ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేసిన విద్యార్థులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని, కేసు కూడా నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు.