లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ను సీఎంగా చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ తెలిపారు. లక్నోలో బుధవారం మిత్రపక్ష పార్టీల నేతలతో అఖిలేష్ సమావేశమయ్యారు. వచ్చే నెలలో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ, సీట్ల సర్దుబాటు గురించి వారితో చర్చించారు.
ఈ భేటీ అనంతరం ఓం ప్రకాష్ రాజ్భర్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్కు తదుపరి సీఎంగా అఖిలేష్ యాదవ్ను చేస్తామన్నారు. ఈ సమావేశంలో తామంతా ఈ మేరకు ప్రతిజ్ఞ చేసినట్లు చెప్పారు. ఎస్పీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థుల జాబితాను దశలవారీగా విడుదల చేస్తామని అన్నారు. తన పార్టీ మొదటి, రెండో దశలో పోటీ చేయదని ఓం ప్రకాష్ రాజ్భర్ తెలిపారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎల్డీ, ఎస్బీఎస్పీ, మహాన్ దళ్, జనవాది పార్టీ (సోషలిస్ట్) వంటి చిన్న పార్టీలతో పొత్తును ఎస్పీ ఇప్పటికే ఖరారు చేసింది. మరోవైపు ఎస్పీ కూటమితో కలిసి తాము కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మంగళవారం తెలిపారు. యూపీ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.