Piyush Jain | ఇంట్లో ఎటు చూసినా ధనపు రాశులే.. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలే. 120 గంటల పాటు సోదా చేస్తే.. 257 కోట్ల రూపాయలు దొరికాయి. ఆ నోట్ల కట్టలను సురక్షితంగా తరలించడానికి పోలీసులు ఏకంగా ఓ కంటెయినర్నే తీసుకొచ్చారంటే ఆషామాషీ వ్యవహారమే కాదు. అంతే కాదు సుమా.. దాడులు చేసే సమయంలో ఐటీ అధికారులకు కునుకు తీయడానికి కూడా సమయం దొరకలేదట. డబ్బులు లెక్కించడం వాళ్ల తరం కాకపోతే 8 మెషిన్ల సహాయంతో డబ్బులు లెక్కించారు. ఇదంతా కాన్పూర్ వ్యాపారి పీయూశ్ జైన్ వ్యవహారం గురించే మాట్లాడుకునేది. పన్ను ఎగవేత ఆరోపణలు తీవ్రం కావడంతో సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూశ్ జైన్ ఇంట్లో ఐటీ అధికారులు, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం విదితే.
ఇంత ధనపు రాశుల మధ్య జీవిస్తున్నా ఆయన చాలా సాదాసీదాగానే జీవితం గడుపుతారు. ఎక్కడా హంగు, ఆర్భాటాలు ప్రదర్శించరు. అసలు తన వద్ద అన్ని నోట్ల కట్టలున్నాయంటే ఎవరూ నమ్మబుద్ధే కానంత సాదాసీద జీవితం ఆయనది. ఓ స్కూటర్పై మాత్రమే వెళతారట. ఆయన ఇంటి ముందు ఓ వోక్స్వాగన్ కారు, ఓ టయోటా కారు మాత్రమే ఉంటాయి. ఆయన అవే వాడతారట. అవి కూడా ఆయన కుమారుడు ప్రత్యూశ్ పేరుతో రిజిస్ట్రేషన్ అయి వున్నాయి. అయితే ఆయన ఇంటి వాచ్మెన్లను మాత్రం సంవత్సరానికి ఒకసారి మార్చేస్తారట. కేవలం ఇద్దరు వాచ్మెన్లను మాత్రమే ఆయన ఉపయోగించుకుంటారు. వారికి నెలకు 7,500 రూపాయల జీతం ఇస్తాడు.
పీయూశ్ జైన్ కాన్ఫూర్లో జన్మించినా, ఉండేది మాత్రం కన్నౌజ్లోనే. కన్నౌజ్లో పూర్వీకుల ఇల్లు ఉండేది. దానిని ప్రస్తుతం ఓ విలాసవంతమైన కాటేజీగా మార్చేశాడు. అయితే పీయూశ్ ఇంత కుబేరుడన్న విషయం తమకు తెలియదని ఇరుగు పొరుగు వాళ్లు అంటున్నారు. పీయూశ్ తండ్రి పేరు మహేశ్చంద్ర జైన్. ఆయనో ఫార్మసి వ్యాపారి. ఈ వ్యాపారాన్ని మహేశ్చంద్ర వాళ్ల కుమారులు కూడా నేర్పించారు. 15 సంవత్సరాలు విపరీతంగా కష్టపడి, ప్రస్తుత స్థాయికి పీయూశ్ జైన్ చేరారని ఇరుగు పొరుగు వాళ్లు చెబుతుంటారు.