న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు గొప్ప శుభవార్త చెప్పింది. ఉద్యోగి, యాజమాన్యం వాటా సహా పీఎఫ్ నిధిలో అర్హతగల బ్యాలెన్స్లో నూటికి నూరు శాతం విత్డ్రా చేసుకోవచ్చు. చదువుల కోసం 10 సార్లు, పెళ్లి కోసం 5 సార్ల వరకు పాక్షిక విత్డ్రాయల్ పరిమితిని పెంచారు. పాక్షిక విత్డ్రాయల్స్ కోసం కనీస సర్వీసు నిబంధనను 12 నెలలకు తగ్గించారు. కార్మిక శాఖ ఓ ప్రకటనలో సోమవారం ఈ వివరాలను తెలిపింది.
ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సోమవారం ఈ సంచలన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దీంతో 7 కోట్ల మందికిపైగా చందాదారులకు ప్రయోజనం చేకూరుతుంది. సీబీటీ ఆమోదించిన మరికొన్ని నిర్ణయాలు ఏమిటంటే, సంక్లిష్టమైన 13 నిబంధనలను ఏకైక నిబంధనగా విలీనం చేశారు. దీనిలో మూడు వర్గీకరణలు ఉన్నాయి. 1. అత్యవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), 2. గృహ నిర్మాణ అవసరాలు, 3. ప్రత్యేక పరిస్థితులు. ఇకపై ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ఖాతాలోని అర్హతగల బ్యాలెన్స్లో నూరు శాతం సొమ్మును విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి వాటాతోపాటు, యాజమాన్యం వాటాను విత్డ్రా చేసుకోవచ్చు.
విత్డ్రాయల్ పరిమితులను సరళతరం చేశారు. అన్ని పాక్షిక విత్డ్రాయల్స్కు కనీస సర్వీసు కేవలం 12 నెలలు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో పాక్షికంగా సొమ్మును విత్డ్రా చేసుకోవాలంటే సభ్యులు కారణాలను వివరించవలసి ఉండేది. ప్రకృతి విపత్తులు, లాకౌట్లు/సంస్థ మూతబడటం, నిరుద్యోగిగా కొనసాగడం, మహమ్మారి రావడం వంటి కారణాలను తప్పనిసరిగా చెప్పవలసి ఉండేది. దీనివల్ల క్లెయిములు తిరస్కరణకు గురయ్యేవి. సీబీటీ తాజా నిర్ణయాల ప్రకారం సభ్యులు ఈ క్యాటగిరీలో ఎటువంటి కారణాలను చెప్పవలసిన అవసరం లేదు.
తాజా నిబంధనల ప్రకారం, సభ్యుడు అన్ని వేళలా కనీస బ్యాలన్స్ను మెయింటెయిన్ చేయాలి. సభ్యుని ఖాతాలో కంట్రిబ్యూషన్లలో 25 శాతాన్ని మినిమం బ్యాలెన్స్గా కేటాయించాలి. దీనివల్ల సభ్యుడు ఈపీఎఫ్ఓ అందించే అత్యధిక వడ్డీ రేటును పొందడానికి వీలవుతుంది. దాంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిబంధనలు సరళంగా ఉండటంతోపాటు ఉద్యోగులకు సానుకూలంగా ఉండటం, డాక్యుమెంటేషన్ అవసరం లేకపోవడం వల్ల పాక్షిక విత్డ్రాయల్ కోసం క్లెయిములు నూటికి నూరు శాతం పరిష్కారమవడానికి మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ప్రీమెచ్యూర్ ఫైనల్ సెటిల్మెంట్కు రెండు నెలల గడువు ఉంది. దీనిని 12 నెలలకు పెంచారు. ఫైనల్ పెన్షన్ విత్డ్రాయల్ పీరియడ్ను రెండు నెలల నుంచి 36 నెలలకు పెంచారు. పాక్షిక విత్డ్రాయల్స్ నిబంధనలను సరళతరం చేయడం వల్ల సభ్యులు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ లేదా పెన్షన్ హక్కులకు విఘాతం కలగకుండా తమ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతారు. కోర్టు వివాదాలను తగ్గించడం కోసం విశ్వాస్ స్కీమ్ను ప్రవేశపెట్టారు.