ముంబై, ఏప్రిల్ 22: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మరోసారి సమర్థించుకున్నారు. శుక్రవారం టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా ఇంధన ధరలను పెంచగా.. ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ర్టాలు వ్యాట్ తగ్గించాలని పురి ఉచిత సలహా ఇచ్చారు. ఇంధన ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఏమీ ఉండదని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే ధరలను నిర్ణయిస్తాయని చెప్పుకొచ్చారు.
మరి ఎన్నికల సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా దేశంలో ధరలను పెంచకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజల సంస్థలని, ప్రజా ప్రయోజనాల కోసం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాయని బదులిచ్చారు. ఎన్నికల తర్వాత పెంచింది లీటరుకు కేవలం రూ.10లే అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని జహంగీర్పురిలో ఓ వర్గం లక్ష్యంగా బీజేపీ ఆధీనంలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కూల్చివేతలు సాగించిందన్న ఆరోపణలను కేంద్ర మంత్రి పురి ఖండించారు.