Supreme Court | సీఈసీ, ఈసీల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు తేదీని నిర్ణయించింది. అన్ని పిటిషన్లపై మే 14న విచారించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఓ పిటిషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఈ విషయంలో త్వరగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం వచ్చే నెలలో విచారణకు తేదీని నిర్ణయించింది. భూసేకరణతో పాటు అనేక ఇతర కీలకమైన కేసులను ఈ రోజు ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. అయితే, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ 2023లో కేంద్రం చట్టాన్ని తీసుకువచ్చింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.
అయితే, కమిటీ నుంచి సుప్రీంకోర్టు సీజేఐని తొలగించి కేంద్ర న్యాయశాఖ మంత్రికి చోటు కల్పించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్జీవో అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తరపున ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో హాజరయ్యారు. ఎన్నికల కమిషనర్లను ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర కమిటీ నియమించాలని ఆయన గతంలో కోర్టును కోరారు. అలాకాకుండా ప్రభుత్వమే నియమిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సుప్రీంకోర్టు 2023లో ఇచ్చిన తీర్పు హెచ్చరించిందని.. కానీ, ఆ కమిటీలో ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ మంత్రికి చోటిస్తూ కేంద్రం కొత్త చట్టం తెచ్చిందన్నారు. చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్తో పాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.