వారణాసి, ఫిబ్రవరి 5: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో మిగతా సెల్లార్లన్నింటిలోనూ పురావస్తు శాఖ సర్వే (ఏఎస్ఐ) చేపట్టాలని కోరుతూ విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ సభ్యురాలు ఇక్కడి ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. మసీదు ఆవరణకు సంబంధించి మతపరమైన స్వభావం నిర్ధారించటంలో సెల్లార్లలో సర్వే చేయటం కీలకమవుతుందని రాఖీసింగ్ అనే మహిళ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై వారణాసి జిల్లా కోర్టు మంగళవారం విచారణ చేపట్టనున్నది.
ఔరంగజేబ్ కాలంలో ఇక్కడి దేవాలయాన్ని కూలగొట్టి మసీదు కట్టారని కొంతమంది హిందువులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ఏఎస్ఐ సర్వే అనంతరం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాంతో గత వారం నుంచి మసీదు ఆగ్నేయభాగంలోని సెల్లార్లో హిందువులు పూజలు నిర్వహిస్తున్నారు.
మసీదు ఆవరణలో మూసేసిన సెల్లార్లన్నింటిలోనూ ఏఎస్ఐ సర్వే చేపట్టాలని, అప్పుడే మసీదుకు సంబంధించి అసలు నిజాలు బయటకు వస్తాయని తాజాగా కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఇటుకలు, రాళ్లతో మూసేసిన మసీదు బేస్మెంట్ మ్యాప్ను పిటిషన్తోపాటు కోర్టుకు రాఖీసింగ్ తరఫు న్యాయవాది సమర్పించారు.